పునీత ఆవిలాపురి తెరెసమ్మ
తెరెసా 1515వ సంవత్సరం ఆవిలాలో మార్చి 28న తేదీన జన్మించారు. 1582 లో చనిపోయారు. 1622 సంవత్సరంలో లో ఆమె చనిపోయిన 40 సంవత్సరాలకు ఆమె పునీతురాలుగా ప్రకటించబడింది. 1970 సెప్టెంబర్ 27 న ఆమె తిరుసభ పండితురాలుగా ప్రకటించబడింది. ఈమె ఒక సాధారణ స్త్రీ వలె కనపడిన అసాధారణమైన పట్టుదల, సాంఘిక అసమానతలను ఎదుర్కొని విజయాలను సాధించుటలో గొప్ప వ్యక్తిత్వాన్ని కనపరిచిన అరుదైన వ్యక్తి. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె జీవితంలో అనేక ఆటంకాలలో కూడా తాను అనుకున్న దానికి సాధించిన ఒక స్త్రీ మూర్తి. మనం ప్రేమించే వారి కోసం మనం ఎంత చేయవచ్చో చూపించిన ఒక గొప్ప స్త్రీ. తిరుసభలో వరకట్నం లేకుండా సన్యాసినులను మఠంలోనికి తీసుకున్న మొదటి వ్యక్తి. అనేక నూతన సంప్రదాయాలకు అంకురార్పణ చేసిన వ్యక్తి. తీరుసభ మొదటి స్త్రీ పండితురాలు. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలను ఎలా జయించగలమో నేర్పి, మానవుడు తనను తాను ఎలా జయించవచ్చో నేర్పించిన విజయాశీలి. మానవునిలో ఉన్న దైవాన్ని ఎలా చేరుకోవాలో అంతరంగిక ప్రయాణం ఎలా చేయాలో నేర్పిన గొప్ప గురువు మరియు గొప్ప పండితురాలు.
ఆమె తండ్రిగారి పేరు అలెన్సో సంచేస్ ఆమె తల్లి పేరు బియాట్రీస్ ఆహుమాద చిన్నప్పుడు తెరెసా పునీతుల జీవితాలు చదివి ఆ పునీతుల చరిత్రల వలన చాలా ప్రోత్సాహం పొందేది. తెరెసా మరియు ఆమె సోదరుడు రోడ్రిగో బాల్యంలోనే ఇద్దరు కలిసి మూర్సు అనే ప్రాంతం లో వేద సాక్షిగా మరణించాలి అని ప్రయాణం అయి వెళ్లారు, ఆవిలా పూరీ గోడల బయటకు వెళ్ళి నాలుగు స్తంభాలు అనే ప్రాంతంలో వారి బాబాయి వారిని చూసి ఇంటికి తీసుకొనివచ్చాడు. తరువాత రోడ్రిగో ఇది మొత్తం చేసినది తెరెసా అని ఆమె మీద నెపం మోపాడు. తరువాత తన సోదరుడితో ఎడారిలోని క్రైస్తవ సన్యాసుల జీవిత విధానాలు ఆటల రూపంలో ఆడుకునేవారు.
తెరెసా 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆమె తల్లి చనిపోయారు, ఆ సమయములో ఆమె మరియమాతకు చాలా దగ్గర అయ్యారు. మరియమాతను తన తల్లిగా ఉండమని కోరారు. ఈ ప్రాయములో ఆమె కొన్ని వీర గాధలు చదవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా తన అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడము ఆరంభించారు. తన కుమార్తెలో వస్తున్న ఈ మార్పును గుర్తించిన ఆమె తండ్రి ఆవిలాలో ఉన్న పునిత అగుస్టిన్ మఠ కన్యల బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు. ఇక్కడ ఉన్న కన్య స్త్రీల వలన మరలా తన పాత నిర్మల మనస్సును పొందగలిగింది. ప్రార్ధన గురించి తెలుసుకున్నారు, కానీ తన అనారోగ్య కారణాలతో అక్కడనుండి 1532 లో ఇంటికి రావడం జరిగినది. 1533 లో తాను కార్మెల్ సభలో సన్యాసిగా అవ్వాలని తన తండ్రిని అనుమతి అడగగా అందుకు ఆయన నిరాకరించారు. తరువాత 1535 ,నవంబర్ 2 న ఆవిలాలో ఉన్న కార్మెల్ మఠంలో ప్రవేశించారు.
1536 లో సభ వస్త్రాన్ని తీసుకుంది. 1537 లో తన మాట పట్టు తీసుకుంది దాని తరువాత ఆమె ఘోరమైన అనారోగ్యం పాలయ్యింది. కనుక 1538 లో ఆమెను తన ఆరోగ్య కుదుటపడటానికి మఠం నుండి బయటకు తీసుకురావడం జరిగినది. ఈ సమయములోనే ఆమెకు తన బాబాయి ప్రార్ధన చేయడము గురించి ఒక పుస్తకం ఇవ్వడము జరిగినది. ఆ పుస్తకము తనకు చాలా ఉపయోగపడింది, ఆమె ఆరోగ్యం కుదుటపడకపోగా తాను మరణపుటంచుల వరకు వెళ్ళింది. 1539 లో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అందరూ ఆమె చనిపోయింది అనుకున్నారు, కానీ మూడు రోజులకి కొద్దిగా చలనం కలిగినది. తరువాత ఆమెను మఠానికి తీసుకొచ్చారు పక్షవాతం తో దాదాపు మూడు సంవత్సరాలు బాధపడ్డారు. పునీత యోసేపు గారి ప్రార్ధన సహాయముతో పూర్తిగా కొలుకున్నది . కానీ ఆరోగ్య పరంగా ఆమెకు తన మరణం వరకు కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తన అనారోగ్య కారణాలతో మరియు ఇతర కారణాలతో ప్రార్ధన జీవితాన్ని అంతగా పట్టించుకోలేదు.
1557 లో ఒకసారి మఠానికి పండుగ సందర్భంగా యేసు ప్రభువు స్వరూపాన్ని తీసుకురావటము జరిగినది అది యేసు ప్రభువు శ్రమలు పొందుతున్న స్వరూపము అది చూసిన తరువాత తెరెసా యేసు ప్రభువు శ్రమలకు తాను కారణం అని తాను మరల యేసుప్రభువుకు ఎటువంటి శ్రమలు ఇవ్వకూడదు అని ఆయన శ్రమలలో ఆయనకు ఓదార్పు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే ఆమె యేసు ప్రభువుకు చాల మంది స్నేహితులు అవసరము ఉంది మనం ఆయన స్నేహితులము కావాలని తన తోటి సన్యాసినులతో చెప్పేది. ఈ మఠం లో ఆమె చాలా శ్రమలు అనుభవించింది, ఆమె తన అనారోగ్యం వలన అనేక బాదలు అనుభవించినది. ఈ సమయములోనే తన మొదటి ప్రార్ధన అనుభూతిని పొందింది. తన స్నేహితులు, ప్రార్ధనలో ఆమె పొందే అనుభవాలు మొత్తం కూడా సాతాను నుండి పొందుతుంది అని చెప్పారు. 1556 సంవత్సరంలో ఆమె ఆధ్యాత్మిక గురువు ఫ్రాన్సిస్ అనే యేసు సభ గురువు ఆమె అనుభవాలు దేవుని నుండి వచ్చే అనుభవాలు అని చెప్పారు. ఆమె అనేక దర్శనాలు పొందేది. కొన్ని సార్లు ప్రార్దనలో ఉన్నప్పుడు వచ్చే అనుభవాలు చాలా గొప్పగా ఉండేవి. ఒక్కోసారి ఆమె ప్రార్ధన చేసే సమయములో గాలిలోకి ఎత్త బడేది. అది చూసిన మిగిలిన వారు ఆమెను క్రిందకు తీసుకురావడానికి ఆమెను పట్టుకొని లాగేవారు. 1559 లో ఆమెకు ఒక దర్శనము యేసు ప్రభువు ఆమెకి కనపడటము జరిగినది. ఆమె అప్పటినుండి నిజంగా నాకు యేసు ప్రభువు కనపడ్డారు అలాగున ఈ దర్శనాలు, రెండు సంవత్సరాలు పాటు ఆమెకు కలిగాయి.
ఒక దర్శనములో దేవదూత ఒక అగ్నిజ్వాలతో కూడిన ఒక బంగారు బాణం తో ఆమె హృదయమును గుచ్చినట్లుగా అనిపించినది. తరువాత శారీరకముగా మరియు ఆధ్యాత్మికముగా కూడా ఆమెకు అది బాధతో కూడిన తీయటి అనుభూతిని మిగిల్చింది. ఆమె చనిపోయిన తరువాత ఆమె సమాధిలో ఆమె హృదయం పాడు కాకుండా ఉన్నది అంతే కాదు ఆమె హృదయం మీద రెండు గీతలు ఉండటం గమనించడం జరిగింది. ఇప్పటికీ ఆ హృదయం అల్భ దె థోర్మెస్ అనే ఊరిలో దేవాలయంలో మనం చూడవచ్చు.
ఆమె ఉన్న ఇన్కర్ణేషన్ మఠంలో 150 మంది మఠవాసులు ఉండటము వలన అది ప్రార్ధనకు అనువుగా లేదు. మఠానికి వచ్చే, పోయె వారితో మఠం ఒక సంత వలె ఉంది అని ఆ జీవిత విధానాన్ని తన ఆధ్యాత్మిక గురువుల సహాయంతో సంస్కరించాలని అనుకున్నది. పేదరికంలో మఠాన్ని స్థాపించటానికి అందరూ అడ్డుపడిన కాని ఆమె ఆగస్ట్ 24న 1562వ సంవత్సరంలో నూతన మఠాన్ని స్థాపించారు. 1563 మార్చిలో తెరెసా నూతన మఠానికి వెళ్ళింది. కఠినమైన నియమాలతో పాత కార్మెల్ జీవితాన్ని పునరుద్ధరించాలని ఆశతో మొదలు పెట్టిన పని మొదలైనది. కొద్ది మంది సన్యాసినులతో ఎప్పుడు ప్రార్ధన , ధ్యానం చేస్తూ వారు అందరికీ ఆదర్శముగా జీవించడం మొదలు పెట్టారు. మొదటి ఐదు సంవత్సరాలు ఆమె ఆ మఠంలోనే గడిపింది.
ఆమె ఎందుకు ఈ మఠాన్ని స్థాపించారు అని ఒక ప్రశ్న అడిగినప్పడు మనకు ఆమె ఉన్న పాత మఠంలో ప్రార్దనకు అనుకూల వాతవరణం లేదు అందుకే ఆమె నూతన విధానాన్ని స్థాపించారు అని మనం చెప్పవచ్చు. దీనికి ఆమె తన తోటి సహోదరీలతో చెప్పిన సమాధానం మరియొకటి ఉన్నది. అది ఏమిటి అంటే ప్రొటెస్టంట్లు కతొలికులకు వ్యతిరేకంగా ఉద్యమిచ్చిన కాలంలో అనేక దేవాలయాలలో దివ్య సత్ప్రసాదనికి అవమానం కలిగించారు. ఏ విధంగా అంటే అనేక దేవాలయాలలో దివ్య మందసంలో ఉన్న యేసు దివ్య సత్ప్రసాదంను బయటకు తీసి క్రింద పడవేసి అవమానం చేశారు. ఆ అవమాననికి తాను అంటే ఆవిలాపురి తెరేసమ్మ పరిహారం చేయాలని అనుకున్నారు. అది ఏవిధంగా అంటే ఈ నూతన కార్మెల్ మఠంలో ప్రతి నిత్యం దివ్య సత్ప్రసాదంలో ఉన్న యేసు ప్రభువు ఆరాధించబడుతాడు అక్కడి సన్యాసినులతోటి ఆవిధంగా అప్పుడు జరిగిన అవమాననికి తాను పరిహారం చేయాలి అని ఈ నూతన మఠం స్థాపించాలి అనుకున్నది.
దివ్య పూజబలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తరువాత ఆమె అనేక ప్రార్ధన అనుభవాలు పొందేది. ఆమె పొందిన ప్రార్దన అనుభవాలలో కొన్నింటిలో ఆమె ప్రార్దన చేస్తూ ఉండగా అవకాశంలోనికి ఎత్త బడేది. ఆ సమయాలలో తన తోటి సన్యాసినులు ఆమెను పట్టుకొని క్రిందకు లాగేవారు.
పునీత ఆవిలాపురి తెరేసమ్మ కార్మెల్ మఠంలో తీసుకున్న పేరు యేసుని తెరెసా. ఈమె జీవితం మొత్తం యేసు ప్రభువును ఏ విధంగా తాను కలవాలి, లేక ఆయనను తాను ఎలా పొందాలి అనే కోణంలో మాత్రమే ఆలోచించింది అన్నట్లుగా తాను జీవించిది. ఎందుకంటె తాను ఎలా యేసు ప్రభువును చేరుకోవాలి, ఆయన కోసం తాను ఏమి చేయగలదు మరియు ఏమి చేసింది మాత్రమే ఆమె జీవితం మొత్తం కూడ. అంతకు మించి మనం ఆమె జీవితంలో ఏమి చూడం. ఆమె పేరు యేసుని తెరెసా అని ఎలా మార్చుకున్నదో అలానే తాను యేసు ప్రభువును తన అనువణువున నింపుకున్నది.
యేసు ప్రభువును ఆమె ఎలా చూసింది అని ఒక ప్రశ్న అడిగితే నాకు కొన్ని విషయాలు ఆమె గురించి గుర్తుకు వస్తాయి అవి ఏమిటంటే? ఆమెకు యేసు ప్రభువే సర్వస్వం. ఆయన మానవ గుణాలను ఎంతో అభిమానంచేది, సమరియా స్త్రీ తో మాటలాడిన విధానం, వ్యభిచారం లో పట్టుబడిన స్త్రీ ని కాపాడిన విధానం ఆమెకు దైవ కరుణ తెలియజేస్తుంది. మరియ మర్తల వలె ఆయన వద్దనే ఉండాలని, తన మాటలు వినాలని , తనకు సేవ చేయాలని కోరుకున్నది. యేసు ప్రభువుని ప్రతి గుణాన్ని ఆమె ప్రేమించింది. ఆయనను తన గురువుగా భావించింది. యేసు ప్రభువు తన మార్గంగా, గమ్యంగా భావించింది. యేసు ప్రభువుకు ఎలా తను సేవ చేయగలను అనే ఆలోచించింది. యేసు ప్రభువును ఆమె ఎంతలా ప్రేమించింది అంటే ఆమె చేసేది ఏది అయిన అది క్రీస్తును పొందటం కోసమే అనే విధంగా ప్రేమించింది. ఆయనను పొందటమే తన జీవిత ధ్యేయం అయ్యింది. తనకు ప్రార్ధన యేసు ప్రభువును కలుసుకునే ద్వారం అయ్యింది. తనలో యేసు ప్రభువు తనలో ఉన్నారని గ్రహించింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి తనలోనికి తాను ఎలా వెళ్ళాలి అని నేర్చుకున్నది. ఒక వ్యక్తి ఆత్మలోనికి ప్రవేశించడం చాలా క్లిష్టమైన ప్రయాణం అని తెలుసుకుంది. అయిన ఈ తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకోవడానికి ప్రార్దన సహయం ద్వార అంతరంగిక ప్రయాణం మొదలుపెట్టింది. తనలో ఉన్న యేసు ప్రభువును కలుసుకుంది. ఈవిధంగా ఆమెకు ప్రార్దన తనలో ఉన్న యేసు ప్రభువును కనుగోని ఆయనతో ఉండటం, ఆయన అనుభూతిని పొందటం అయ్యింది.
1567 లో కార్మెల్ సభ అధిపతి జాన్ బాప్టిస్ట్ రోస్సీ ఆవిల వచ్చారు. ఆయన తెరేసా ను మెచ్చుకొని ఇంకా కొన్ని సన్యాసినుల మఠాలను స్థాపించాలని ప్రోత్సహించారు. అదే విధముగా రెండు పురుష మఠాలను స్థాపించటానికి అనుమతి ఇచ్చారు. అప్పుడు మెదిన దేల్ కంపో , మళగొన్ , వయ్యాడోలిద్ ,తోలేదో, పస్ట్రాన , సాలమాంక మరియు అల్బ దె తొర్మెస్ లలో మఠాలు స్థాపించారు.
తెరెసాకు పురుషుల విభాగానికి సంబంధించి సంస్కరించబడిన రెండు మఠాలను ఏర్పాటు చేయడానికి అనుమతి లభించినది. పునీత సిలువ యోహను మరియు ఆంథోనీ హెరోడియా ల సహకారంతో 1568, నవంబర్లో దురుఏలో వద్ద మొదటి మఠాన్ని స్థాపించారు. తరువాత 1571 లో సెగోవియ వద్ద ,1574 లో బేయస్ సేగుర వద్ద ,1575 లో సేవియ్యే వద్ద , 1576 లో కరవక శిలువ వద్ద స్థాపించారు
1576 లో సంస్కరణ ఇష్టపడని కార్మెలియులు, సంస్కరించబడిన కార్మెలియులను హింసించటము మొదలు పెట్టారు. పియసెంజ లో జరిగిన జెనెరల్ చాప్టర్లో ఎటువంటి నూతన మఠాలను ఏర్పాటు చేయవద్దని చట్టం చేశారు. తెరెసాను ఆమె ఏర్పాటు చేసిన ఏదో ఒక మఠానికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించారు. అన్నింటికీ అంగీకరిస్తూ ఆమె తోలేదోలో ఉన్న మఠానికి పరిమితం అయ్యారు. మిగిలిన వారిని అనేక కష్టాలకు గురిచేశారు. పునీత తెరేసమ్మను అనేక మంది తీరుసభ అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఈమె మఠ వాసి అని చెబుతూ మఠంలో ఉండకుండా దేశ దిమ్మరి వలె తిరుగుతుంది అని అన్నారు. కాని ఆమె తన సంతోషం కోసం ఎప్పుడు బయటకు వెళ్లలేదు. కేవలం ఏదో ఒక నూతన మఠం స్థాపించడానికి అక్కడ యేసు ప్రభువును సేవించేలా చేయడానికి మాత్రమే వెళ్ళింది. ఆమె ప్రయాణాలు అన్ని కూడా చాలా కష్టంతో కూడినవి ఎందుకంటే ఆనాటి రోజులలో రాహదారులు ఏమి లేవు, మరియు ప్రయాణాలు గుర్రపు లేదా గాడిద బండ్ల మీదనే జరిగేది. అనేక సార్లు క్రింద పడటం కూడా జరిగేది. కాని యేసు ప్రభువు సేవించ బడాలి అనే కోరికతో ఆమె నూతన మఠలకు స్థలం చూడటానికి లేదా స్థాపించడానికి వెళ్ళేది.
ఆమెజీవితపు చివరి మూడు సంవత్సరాలు అందలుసియా , పాలెన్సియ ,సొరియా , బుర్గోస్ మరియు గ్రనాద లో మఠాలను స్థాపించారు. 1577 ఆవిలా కు వెళ్ళింది. ఆమెను అనేక విధాలుగా విమర్శించిన కార్డినల్ కూడా ఆమెకు అనుకూలముగా మాటలాడారు . 1580 లో నూతన మఠాన్ని స్థాపించారు. 1580 జూన్ 22 న గ్రెగోరి 13 వ పోఫు గారు నిష్పాదుక కార్మెల్ ప్రొవిన్సు ను ఏర్పాటు చేశారు. 1582, సెప్టెంబర్ 19 న మెదిన దేల్ కాంపొను వదలి 20 న ఆల్బ దె తోర్మేస్ వచ్చారు. అప్పటికే రక్తస్రావంతో బాధ పడుతున్నారు. అక్టోబర్ 4 న ఆల్బ దె తోర్మేస్ వద్ద మరణించారు. మరుసటి రోజు గ్రెగోరియన్ కాలెండరు మార్పుతోటి అది అక్టోబర్ 15 అయ్యింది. ఆమె తన మఠ వాసులకు ప్రార్థన , మన ఆత్మలో ఉన్న దేవుని కనుగొనట ఎలా ?, ఆధ్యాత్మిక సంపూర్ణత ఏ విధముగా సాధించాలి అనే అంశాలమీద రాసిన గ్రంధాలు అనేక మందికి దేవుని తెలుసుకొని, చేరుకోవటానికి ఉపయోగపడుతున్నాయి.
Fr. Amruth OCD