మత్తయి 5:13-16
మీరు భూమికి ఉప్పువలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన యెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకును పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండజాలదు. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైననే ఉంచెదరు గాని కుంచము క్రింద ఉంచరు గదా ! ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.
మౌరీస్ మొర్లి పోంటి అనే ఫ్రెంచ్ తత్వ వేత్త క్రైస్తవుల గురించి, క్రైస్తవులు భూమికి సారం ఇచ్చేటువంటి వారు, లోకానికి అర్ధం ఇచ్చేటువంటి వారు అని చేప్పారు. ఇది నిజమే ఎందుకంటే మానవున్ని సృష్టించినప్పుడు, దేవుడు మానవునికి ఈ బాధ్యత ఇచ్చాడు. సకల జీవ రాసులను సృష్టించిన దేవుడు మానవున్ని వాటికి అధిపతిని చేసి వాటికి పేర్లు పెట్టుటకు, వాటిని అన్నీ విధాలుగా వృద్ది చెందే విధంగా చేయుటకు మానవునికి అధికారం ఇచ్చాడు. సకల జీవరాసులకు పేర్లు పెట్టుటకు వాటికి ఒక అర్ధం ఇవ్వుటకు, మానవునికి బాధ్యత ఇవ్వబడింది. ఈ లోకానికి అర్ధం ఇవ్వడానికి, దానిని పెంపొందించుటకు మరియు నాశనం కాకుండా చూచుటకు కూడా మానవుని కర్తవ్యం. కాలక్రమేణా మానవుడే లోక నాశననికి కారణం అవుతూ వచ్చాడు. ఇటువంటి స్తితిలో మరల లోకానికి అర్ధం ఇవ్వుటకు, అది నాశనం కాకుండా ఉండుటకు క్రైస్తవుడు తీసుకోవలసిన బాధ్యత గురించి ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది.
మీరు భూమికి ఉప్పువలెనున్నారు.
ఉప్పు ఒక వస్తువును పాడుకాకుండా ఉంచుతుంది. యేసు ప్రభువు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని అన్నప్పుడు దీని అర్ధం ఏమి అయిఉంటుంది అని మనం ధ్యానించినట్లయితే మనం ఎల్లప్పుడు ఈ లోకము పవిత్రతను కోల్పోకుండ ఉండే విధంగా చేయాలి అని నేర్పుతుంది. మనం భూమికి ఉప్పు వలె ఉండటం అంటే భూమి దాని సారం పోకుండా కాపాడకలగాలి. క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఈ లోకంలో ఉండి ఈ లోకం చెడిపోకుండా చేయాలి. క్రైస్తవునిగా మనం పవిత్రంగా ఉండి ఎప్పుడు ఈ లోకానికి పవిత్రతను తెలియజేయాలి.
ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన యెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకును పనికిరాదు.
ఉప్పు తన ఉప్పదనం కోల్పోతే దానిని తిరిగి పొందలేదు. ఉప్పు సహజంగా ఎరువుగా మరియు పదార్ధాలు నిలువ వుంచుటకు వాడతారు. ఉప్పు ఉప్పదనం ఎలా కోల్పోతుంది అంటే ఉప్పును రొట్టెలను కాల్చుటకు వేడిచేసేవారు అటువంటి ఉప్పు తన ఉప్పదనం కోల్పోయేది మరియు ఇతర పదార్ధాలు ఎక్కువ మోతాదులో కలిపిన దానిని మరల వాడుటకు ఉపయోగపడదు, అలానే మనం కూడా ఇతర వ్యావహారాలలో ఎక్కువ కలిసినప్పుడు మన క్రైస్తవ్యత్వాన్ని కోల్పోతువుంటాము. క్రైస్తవులు లోకంలోవారి వలె జీవిస్తూ వారి క్రైస్తవత్వాన్ని కోల్పోతారో అప్పుడు లోకంలో ఎటువంటి ప్రభావం చూపలెరు. వారు లోకములోని వారి కంటే భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే తమ ప్రభావం చూపగలరు. అందరిలో ఒకరిగా ఉండాలి అని అనుకుంటే మనం క్రైస్తవత్వాన్ని కోల్పోతాము.
క్రైస్తవుడు లోకానికి ఏ విధంగా ఉపయోగపడతాడు?
ఉప్పు చెడి పోకుండా ఉండటానికి ఉపయోగ పడుతుంది. ఈ లోకానికి క్రైస్తవుడు ఉప్పుగా ఉండుట వలన ఈ లోకము చెడి పోకుండా ఉండటానికి ఉపయోగపడుతాడు. ఇది ఎలా ఉంటుంది అంటే ఆదికాండంలో మనం అబ్రహాము దేవుడుని వేడుకొనిన వృత్తాత్తము వలన దీనిని అర్ధం చేసుకోవచ్చు. అబ్రహాము దేవున్ని సొదొమో గోమోర పట్టణాన్ని కాపాడమని అర్ధిస్తాడు. ప్రభువా ఒక యాభై మంది మంచి వారు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతారా ? నలభై మంది మంచి వారుంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా? ముప్పై మంది మంచి వారు ఉంటే కాపాడుతారా? ఇరవై మంది మంచి వారు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా? పదిమంది మంచి వారుంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా? అబ్రహాము అడిగిన ఆ యాభై మంది , నలభై మంది , ముప్ఫై మంది, ఇరవై మంది, పది మంది మంచి వారు క్రైస్తవులు అయిన మనముగా ఉండాలి. ఈ లోకము నాశనము కాకుండా ఉండటానికి క్రైస్తవునిగా మనం మన బాధ్యత నిర్వర్తించాలి. ఇది క్రైస్తవునిగా మన కర్తవ్యం.
లూకా సువిశేషంలో ఉప్పు భూమికి సారం ఇవ్వుటకు వాడటం జరుగుతుంది. అది భూమిలో మంచివి పెరిగే విధంగా చెడును పెరగకుండా చేస్తుంది. క్రైస్తవులు మంచిని లోకంలో పెంచుటకు మరియు చెడును పెరగకుండా చేయుటకు ఉపయోగపడాలి.
మానవ జీవితానికి నిజమైన మానవత్వాన్ని పరిచయం చేసేటువంటి బాధ్యత క్రైస్తవునిది. ఎలా అంటే యేసు క్రీస్తు జీవించిన విధంగా జీవించుట ద్వారా మానవత్వానికి దైవిక విలువలు చేరుస్తూ మానవత్వానికి అమరత్వాన్ని చూపిస్తుంది, మరియు పాలుపంచుకొనేలా చేస్తుంది. ఇది నిజానికి క్రైస్తవ జీవిత ఔన్నత్యం గురించి ఇది తెలుపుతుంది.
మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండ జాలదు.ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు ,మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.
ఒక పర్వతం మీద కట్టబడిన పట్టణం దాచబడలేదు. మీ కాంతిని ఇతరుల ముందు ప్రకాశింప నిండు అప్పుడు వారు మీ మంచి పనులను చూసి పరలోకమున ఉన్న మీ తండ్రిని మహిమ పరుస్తారు. ఏమిటి ఈ మాటల యొక్క అర్ధం.
ప్రభువు వెలుగు గురించి చెబుతున్నప్పుడు వాని యొక్క అర్ధము , మనము ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాము అని అంటే వెలుగు మనకు కాంతిని ఇవ్వడమేకాదు , మనం ఎటువంటి అపాయములలో చిక్కుకొనకుండా ఉండుటకు ఉపయోగ పడుతుంది. క్రైస్తవుని జీవితం ఇతరులు ఎవరు అపాయమునకు గురికాకుండా చేస్తుంది. ఎందుకు అంటే ఎలా ప్రయాణించాలో క్రైస్తవుడు వెలుగులో ఉండుటవలన అతనికి తెలుస్తుంది. పాపం అనే అంధకారంలో పడిపోకుండా లోకాన్ని కాపాడవలసిన బాధ్యత, ఇతరులను హెచ్చరించ వలసిన బాధ్యత క్రైస్తవుని మీద ఉంది.
యేసు ప్రభువు నేనే ఈ లోకానికి వెలుగును అని చెబుతున్నారు. అలానే అయన శిష్యులు కూడా ఈలోకానికి వెలుగు వలె ఉన్నారు అని చెబుతున్నారు. ఈ మాటలకు అర్ధం ఏమిటి అంటే మనం ఆయన వలె జీవించాలసిన ఆవశ్యకత ఉంది అని మనం నేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా మనకు వెలుగు అంటే యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు వారి జీవితం గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. వారి జీవితాలు వారి ముందే కనపడుతున్నాయి. మరియు వారి గురించి తెలుసుకున్నవారు పూర్తిగా ఎలా జీవించాలో యేసు ప్రభువు ద్వారా తెలుసు కుంటున్నారు. కనుక మనం ఇతరులకు వారి జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పేలా , వారు ఎలా జీవించాలో తెలిపేలా మనం జీవితాలు ఉండాలి.
ఈ సువిశేష భాగం మనకు క్రైస్తవ ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక మొదటిగా క్రీస్తు అనుచరులు క్రీస్తు వలె జీవించడం నేర్చుకోవాలి. క్రైస్తవులు వారి యొక్క జీవిత విధానాన్ని ఇతరులకు సుమాతృకలు తీసుకురావాలి. ఇతరులు ఎలా జీవించాలి అని నేర్చుకునే విధముగా క్రైస్తవ జీవితాలు ఉండాలి. క్రై స్తవులు వారి జీవిత విధానం ద్వారా ఇతరులకు మార్గ చూపరులుగా ఉండాలి. నిజమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రజలను మార్చవలసిన గొప్ప బాధ్యత క్రైస్తవుల మీద ఉన్నది. ఇది ప్రతి క్రైస్తవుని కర్తవ్యం. మనము కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇతరులకు మన వెలుగు చూపించవలసిన వాళ్ళము. అంటే మన మంచి పనులను చూసి ఇతరులు దేవుని తెలుసుకొనే విధంగా మన పనులు ఉండాలి. వాని ద్వారా వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కనుక ఆ విధంగా జీవించుటకు ప్రయత్నించుదాం.