లూకా 21:12-19
ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి, ప్రార్ధనామందిరములకును, చెరసాలలకును అప్పగించి, హింసింతురు. నా నామము నిమిత్తము రాజులయొద్దకు, అధిపతులయొద్దకు మిమ్ములను తీసుకొనిపోవుదురు. ఇది మీరు సాక్షులుగఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసినదానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును, మిమ్ములను ఖండించుటకును వీలుకాని వాక్కును , వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు , బంధువులు, మిత్రులుకూడ మిమ్మును పట్టిఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరు ద్వేషింతురు. కాని మీ తల వెంట్రుకకుడా రాలిపోదు. మీ సహనమువలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు.
ధ్యానము: యేసుప్రభువును అనుసరించేవారిని యేసు ప్రభువును వ్యతిరేకించేవారు ఎలా వేధించేది తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులను అనేక విధాలుగా హింసిస్తారు. శిష్యులను బంధిస్తారు, ప్రార్ధన మందిరాలకు చెరసాలలకు అప్పగిస్తారు. ప్రార్ధన మందిరాలకు ఎందుకు వారిని అప్పగిస్తారు? ప్రార్ధన మందిరాలు కేవలం ప్రార్ధన మాత్రమే ఇతరులను తీర్పు తీర్చే న్యాయస్థానాలులాగ కూడా పని చేస్తాయి. యేసు ప్రభువు అనుచరులను శిక్షించడానికి కూడా అవి వాడబడతాయి అని ప్రభువు చెబుతున్నారు. చెరసాలలకు యేసు ప్రభువు శిష్యులను ఎలా శిక్షించారో మనకు తెలుసు. వారిని ఎంతో క్రూరంగా హింసించారు అప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికి కూడా నిజమైన అనుచరులను ఇప్పటికి కూడా అలానే శిక్షిస్తారు.
యేసు ప్రభువు శిష్యులు లేక ఆయన అనుచరులు అనే ఒకే ఒక కారణం వలన ప్రజలు వీరిని శిక్షిస్తారు. యేసు ప్రభువునువారు ఒక శత్రువులాగ చూస్తున్నారు. అయన అనుచరులను కూడా అలానే చూస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులకు హింసలు తమ గురువుకు సాక్షులుగా ఉండుటకు ఒక మంచి అవకాశం దీనిని యేసు ప్రభువు అనుచరులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో అనుచరులు సాక్షులుగా ఉండాలి. వీరిని బందించినప్పుడు లేక వారికి కష్టాలు ఉన్నప్పుడు వీరు వాటికి కలవరపడనవసరం లేదు. ప్రార్ధనాలయాలలో, చెరసాలలో , పెద్దల ముందు ఏమి మాట్లాడాలో అని వీరు ఏమి ముందుగానే తయారుకానవసరం లేదు. వారు ఏమి మాట్లాడాలో కూడా ప్రభువే వారికి తెలియజేస్తారు. ఎవరుకూడా వీరికి నేర్పించనవసరం లేదు.
విరోధి మాటాలడలేని విధంగా మాట్లాడే విధంగా , వీరి మాటలను ఖండించలేని జ్ఞానాన్ని వీరికి దేవుడు ప్రసాదిస్తారు. ఈ మాటలు ఎంత నిజమో మనకు స్తెఫాను జీవితం చూసినప్పుడు తెలుస్తుంది. స్తెఫాను మాటలను విన్న పెద్దలు ఆయన వివేకమును వారు ఖండించలేకపోయారు. అందుకే ఆయనను రాళ్లతో కొట్టి చెంపుతున్నారు. మాటలద్వారా లేక జ్ఞానము ద్వారా ఎవరు యేసు ప్రభువు శిష్యులను ఎదుర్కోలేని జ్ఞానము వారికి ఇవ్వడము జరుగుతుంది. అంతమాత్రమున వీరికి అన్ని సమకూర్చబడవు. వీరు ఎన్నో కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. అందరు వీరిని ద్వేషిస్తారు. అంతేకాదు సొంత తల్లిదండ్రులు, సోదరులు వీరిని శత్రువులను పట్టిస్తారు. మరల వీరిని చంపిస్తారు. విటువంటి పరిస్థితులలో కూడా నిజమైన క్రీస్తు అనుచరులు సాక్షులుగాజీవిస్తారు. అందరు ద్వేషించిన వీరు ఎప్పటికి ఆ ద్వేషాన్ని చూపించకుండా ప్రేమనే చూపిస్తూ ఉంటారు.
యేసు ప్రభువు తన శిష్యులకు ఒక మాట చెబుతున్నారు. అది అన్నిటికంటే ముఖ్యమైనది అది ఏమిటి అంటే ఇవన్నీ జరిగిన కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. ఈ వచనము యేసు ప్రభువు తన శిష్యులను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేస్తున్నాడు. ఈ లోకంలోని ఏమి కూడా యేసు ప్రభువు శిష్యులను ఏమి చేయలేదు. వారిని చంపినా కుడా వారికి ఏమి జరుగదు. ఎందుకంటే వారికి మరల ప్రాణం ఇచ్చేటువంటి ప్రభువు వారికి తోడుగా ఉన్నాడు. శిష్యుల సహనం వలన వారి ప్రాణం నిలబడుతుంది. ఇక్కడ శిష్యుల సహనము ఏమిటి అంటే వారు సహనముతో ఎటువంటి ఇబ్బంది అయిన సహిస్తారు.
ప్రార్ధన : ప్రభువా! ఈ లోకంలో ఎందరో మిమ్ములను అనుసరించాలని కోరుకుంటున్నారు. కాని మిమ్ములను అనుసరించుట వలన వచ్చే ప్రతికూల విషయాలను తెలుసుకొని మిమ్ములను అనుసరించకుండానే ఉంటున్నాం. తల్లిదండ్రులు , సోదరి సోదరులు , బంధుమిత్రులు వీరు అందరు ఎక్కడ మాకు వ్యతిరేకంగా మారుతారో అని నిన్ను అనుసరించలేక పోతున్నాము. ప్రభువా!చెరసాలలో బంధించిన ,ప్రార్ధనాలయానికి రానివ్వకపోయినా అందరు నన్ను దూరంగా పెట్టిన, పెద్దల వద్దకు , అధికారుల వద్దకు అధిపతులవద్దకు తీసుకుపోయిన నిన్ను మాత్రమే ప్రేమించే విధంగా నన్ను మార్చండి. ప్రభువా ! మీకు నిజమైన సాక్షిగా జీవించడానికి , సాక్షిగా నిలువడానికి కావలసిన శక్తిని దయచేయండి. ప్రభువా ! నేను మీకు సాక్షిగా జీవించడానికి ఎన్ని కష్టాలు పడటానికి అయినా సిద్ధముగా ఉన్నాను. కాని నాకు వచ్చే కష్టాలు , హింసలు తట్టుకోవడానికి కావలసిన శక్తిని దయచేయండి. ఆమెన్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి